<p><strong>Nagpur Couple Growing Saffron At Home:</strong> నెలకు కొన్ని వేల రూపాయల ఉద్యోగం వస్తే చాలు బతుకు బండిని ఎలాగోలా నెట్టుకుపోవచ్చని చాలా మంది ఆలోచిస్తుంటారు. కొంతమంది వ్యక్తులు మాత్రం, ఉద్యోగం కాకుండా సొంత వ్యాపకంతో జీవితంలో ఎదగాలని భావిస్తుంటారు. దీనిలో విజేతలైన వ్యక్తులు చాలా డబ్బు సంపాదిస్తారు. ఇలాగే, ఓ జంట, ఇంట్లోనే కూర్చుని ప్రతి సంవత్సరం రూ.50 లక్షలు సంపాదిస్తోంది.</p>
<p><strong>డబ్బు సంపాదించడం ఎలా?</strong><br />నాగ్‌పుక్‌కు చెందిన అక్షయ్ హోల్, అతని భార్య దివ్య లోహ్కరే హోల్ ఉద్యోగాల వెంట పడకుండా వినూత్నంగా ఆలోచించారు. సొంతంగా & కొత్త ఏదైనా పని చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమపువ్వు మీద వాళ్ల దృష్టి పడింది. కుంకుమ పువ్వు బంగారంలా చాలా ఖరీదైనది. ఇది, కశ్మీర్‌లోని అత్యంత చల్లటి వాతావరణంలో మాత్రమే పెరుగుతుంది. కశ్మీరీలు, సంప్రదాయికంగా, కుంకుమ పువ్వును పొలాల్లో పండిస్తుంటారు. అక్షయ్ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. సంప్రదాయికమైన మట్టి & నీళ్ల తడి అవసరం లేకుండా ఏరోపోనిక్ పద్ధతిని ఉపయోగించి కుంకుమ పువ్వును సాగు చేశారు, విజయం సాధించారు. ఈ ప్రత్యేకమైన వ్యవసాయ టెక్నిక్‌తో, తమ ఇంటి లోపల కాశ్మీర్‌ తరహా చల్లని & పొడి వాతావరణాన్ని పునఃసృష్టించారు.</p>
<p><strong>ఈ ప్రయాణం ఎలా మొదలైంది?</strong><br />కుంకుమ పువ్వు సాగుకు కాశ్మీర్‌లోని చల్లని శీతాకాలాలు & పొడిగా ఉండే వేసవికాలం అనుకూలమైనవి. అక్షయ్ & దివ్య సాంప్రదాయ పద్ధతులను సవాలు చేసి, సాంకేతికత సాయం తీసుకున్నారు. ముందుగా, వాళ్లు రెండేళ్లలో దఫాలవారీగా మూడున్నర నెలల పాటు కశ్మీర్‌లో గడిపారు. కుంకుమ పువ్వు సాంప్రదాయ సాగు గురించి అధ్యయనం చేశారు.</p>
<p><strong>మొదట కిలో & తర్వాత 350 కిలోలు</strong><br />అక్షయ్ & దివ్య దంపతుల ప్రయాణం ఒక చిన్న ప్రయోగంతో ప్రారంభమైంది. వాళ్లు, మొదట, కేవలం 1 కిలోల కుంకుమ పువ్వు విత్తనాలను కొని నాగ్‌పుర్‌లో పండించడానికి ప్రయత్నించారు. మొదట్లో, కొన్ని గ్రాముల కుంకుమ పువ్వు మాత్రమే చేతికి వచ్చింది. అది చూసి నిరాశపడకుండా, ఎంతో కొంత విజయం సాధించామని సంబరపడ్డారు. ఆ తర్వాత 350 కిలోల కుంకుమపువ్వు గింజలను కొనుగోలు చేశారు. ఈసారి దాదాపు 1,600 గ్రాముల (1.6 కిలోలు) కుంకుమ పువ్వును ఉత్పత్తి చేశారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.</p>
<p><strong>ఏరోపోనిక్ టెక్నిక్ అంటే ఏమిటి? </strong>(What is aeroponic technique?)<br />ఏరోపోనిక్ టెక్నిక్‌లో మట్టి అవసరం లేకుండా మొక్కలు పెంచుతారు & గాలి, పొగమంచును వెదజల్లుతారు. దీనివల్ల, మొక్కలకు నీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ సాంకేతికత స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా పర్యావరణ అనుకూలమైనది. అక్షయ్ & దివ్య తమ ఇంటి లోపల 400 చదరపు అడుగుల స్థలంలో కుంకుమ పువ్వులు పెంచే ఏర్పాటు చేశారు. దీనికి సౌర విద్యుత్తును అనుసంధానించారు. దీనివల్ల వాళ్లకు విద్యుత్‌ ఖర్చు తగ్గడంతో పాటు, కార్బనాల విడుదలను తగ్గించేందుకు కూడా వీలైంది. ఇప్పుడు, అక్షయ్ దంపతులు ఏటా రూ. 50 లక్షలు సంపాదిస్తున్నారు. </p>
<p>ఏరోపోనిక్ టెక్నిక్‌తో కుంకుమ పువ్వును మాత్రమే కాదు, మన ప్రాంతంలో దొరకని ఇతర రకాల పంటలను కూడా పండించవచ్చు.</p>
<p>మరో ఆసక్తికర కథనం: <a title="ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!" href="https://telugu.abplive.com/business/personal-finance/pm-kisan-yojana-rs-2000-deposited-in-farmers-accounts-on-february-24-these-farmers-will-not-get-money-198386" target="_self">ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!</a> </p>