<p>హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు కీలక అడుగు వేశారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో అధికారులు సోమవారం (మార్చి 23న) ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రధాన నిందితుడు (A1)గా పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ (A2), హెచ్‌ఎండీఏ మాజీ అధికారి బి.ఎల్.ఎన్ రెడ్డి (A3), కిరణ్ మల్లేశ్వర్‌రావు (A4), బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈవో సంస్థ (A5)లను ఈ కేసులో నిందితులుగా ఏసీబీ తమ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. </p>
<p>గత బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ ఛార్జ్‌షీటులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థకు ఫార్ములా ఈ కారు రేస్ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించినందుకుగానూ ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో <a title="బీఆర్ఎస్ పార్టీ" href="https://telugu.abplive.com/topic/BRS-Party" data-type="interlinkingkeywords">బీఆర్ఎస్ పార్టీ</a>కి రూ.45 కోట్లు అందాయని ఏసీబీ చెబుతోంది. ఇది స్పష్టమైన క్విడ్ ప్రో కో అని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది నవంబర్‌లోనే ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి ఇచ్చిన తరువాత విచారణ వేగవంతం చేసిన ఏసీబీ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది.</p>
<p>కాగా, ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 18, 2024న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. నగదు సంబంధిత అంశం కావడంతో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిధుల దుర్వినియోగంతో పాటు నేరపూరిత కుట్ర జరిగిందని ఏసీబీ ఛార్జిషీట్‌లో పేర్కొనడంతో కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది.</p>