<p><strong>Farmer Rosaiah impressed CM Chandrababu:</strong> గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామానికి చెందిన 80 ఏళ్ల ముత్తవరపు రోశయ్య దేశవ్యాప్త ప్రకృతి ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎనభై ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి, మట్టిని నమ్ముకుని ఆయన చేస్తున్న సాగు ప్రయోగాలు అబ్బురపరుస్తున్నాయి. కేవలం 75 సెంట్ల భూమిని ఒక ప్రయోగశాలగా మార్చి, అందులో ఏకంగా 52 రకాల పంటలను పండిస్తూ, ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం జీవనాధారం మాత్రమే కాదు, అది ఒక లాభసాటి సాగు అని నిరూపిస్తున్నారు. ఆయన సాగు చేస్తున్న తీరును చూస్తుంటే ఒక చిన్నపాటి అడవిని తలపిస్తుంది.</p>
<p><strong>ప్రకృతి వ్యవసాయంపై మక్కువ </strong></p>
<p>రోశయ్య ఈ ప్రయాణం వెనుక ఒక బలమైన స్ఫూర్తి ఉంది. 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలా ప్రోత్సహించినప్పుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశాయి. అంతకుముందు రసాయన ఎరువులతో భూమి చవిటిగా మారుతుండటం, పెట్టుబడులు పెరిగి లాభాలు తగ్గడం గమనించిన రోశయ్య గారు, ఆ ఏడాది నుండి పూర్తిగా రసాయనాలకు స్వస్తి పలికారు. కేవలం జీవామృతం, ఘన జీవామృతం వంటి ప్రకృతి సిద్ధమైన ఎరువులతో భూమిని మళ్లీ జీవకళ ఉట్టిపడేలా చేశారు.</p>
<p><strong>బహుళ అంతస్తుల సాగు పద్దతి </strong></p>
<p>రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో అడుగుపెడితే ఆశ్చర్యం కలగక మానదు. ఒకే భూమిలో బహుళ అంతస్తుల సాగు పద్ధతిని ఆయన పాటిస్తున్నారు. కొబ్బరి, మామిడి వంటి పెద్ద చెట్ల నీడలో అరటి, దాని కింద కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు, మందు మొక్కలు ఇలా మొత్తం 52 రకాలను సాగు చేస్తున్నారు. మిరప, వంకాయ, బెండ, చిక్కుడు వంటి నిత్యం అవసరమయ్యే కూరగాయలతో పాటు అరుదైన పండ్ల మొక్కలను కూడా ఆయన పెంచుతున్నారు. దీనివల్ల ఆయనకు ప్రతిరోజూ ఏదో ఒక ఆదాయం సమకూరుతోంది. </p>
<p><strong>వయసును లెక్క చేయకుండా వ్యవసాయం</strong></p>
<p>ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా క్షేత్రంలో పనిచేస్తూ, సేంద్రియ ఉత్పత్తుల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. మనం భూమికి విషం పెట్టకపోతే, భూమి మనకు అమృతాన్ని ఇస్తుంది అని ఆయన చెప్పే మాటలు ఎంతో లోతైనవి. రోశయ్య సాగు పద్ధతుల వల్ల భూమిలో వానపాములు పెరిగి, భూమి సారవంతమైంది. అంతేకాకుండా, ఆయన పండించే ఉత్పత్తులకు మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉంది. స్థానికులు ఆయన తోట వద్దకే వచ్చి విషరహిత కూరగాయలను పోటీ పడి మరీ కొనుగోలు చేస్తుంటారు. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te">భూమిని తల్లిలా భావించి... ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ... నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య గారి… <a href="https://t.co/599WBEC6Gq">pic.twitter.com/599WBEC6Gq</a></p>
— N Chandrababu Naidu (@ncbn) <a href="https://twitter.com/ncbn/status/2032357090162065447?ref_src=twsrc%5Etfw">March 13, 2026</a></blockquote>
<p><strong>చంద్రబాబు అభినందన </strong></p>
<p>రోశయ్య విజయగాథను ముఖ్యమంత్రి <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> నాయుడు స్వయంగా ట్వీట్ చేస్తూ అభినందించడం ఆయన కృషికి దక్కిన గొప్ప గౌరవం. చిన్న భూకమతాలు ఉన్న రైతులు వ్యవసాయం దండగ అని భావించే ఈ రోజుల్లో, తక్కువ భూమిలో వైవిధ్యమైన పంటలతో ఎలా రాణించవచ్చో రోశయ్య కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని, సంకల్పం ఉంటే ప్రకృతి సహకారంతో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్న ఈ రైతు అందంరికీ ఆదర్శంగా మారారు. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/world/lpg-cylinders-are-completely-banned-in-these-countries-240687" width="631" height="381" scrolling="no"></iframe></p>