<div><strong>Grand India Pavilion:</strong> దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్‌ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్(Grand Indian Pavilion) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు జయంత్ చౌధరి, చిరాగ్ పాస్వాన్‌తోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు,రాయితీలు, మానవ వనరులు,మౌలిక వసతులు సహా అన్ని వివరాలను ఇక్కడ తెలపనున్నారు. ఆసక్తి కలిగిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పెవిలియన్ పనిచేయనుంది.</div>
<div> </div>
<div>పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు(Chandra Babu), రేవంత్‌రెడ్డి దావోస్‌ పయనమయ్యారు. జ్యూరిక్(Zurich) విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. అప్పుడు అక్కడికి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు బృందాన్ని రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముచ్చటించారు. ఇరురాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించుకున్నారు. అనంతరం సీఎం రెవంత్‌రెడ్డి బృందం జ్యూరిక్‌ నుంచి దావోస్‌(Davos)కు రైలులో వెళ్లారు. దావోస్‌లో నేడు,రేపు,ఎల్లుండి జరిగే సదస్సులో ముఖ్యమంత్రి బృందం పాల్గొననుంది. పెట్టుబడులు సాధనే లక్ష్యంగా 15 ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భారీ పెట్టుబడుల లక్ష్యంగా దాదాపు 15 ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.</div>
<div> </div>
<div>అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్యూరిక్ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు.అక్కడే పారిశ్రామికవేత్తలతో సమావేశమైన చంద్రబాబు(Chandra Babu) బృందం...ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. ముఖ్యంగా మాన్యుపాక్చరింగ్, ఆర్‌ అండ్‌ డి రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించింది. విశాలమైన సముద్రతీరం, పోర్టులు, విమాశ్రయాలు, రైలు,రోడ్డు కనెక్టివ్‌ గురించి వారికి వివరించింది.పెట్టుబడిదారులకు ఏపీ ఇస్తున్నన్ని రాయితీలో భారత్‌లో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని చంద్రబాబు వివరించారు. అలాగే సింగిల్ విండో విధానంలో కేవలం 15 రోజుల్లోనే అనుమతులన్నీ ఇస్తామన్నారు.</div>
<div>కొత్తగా రానున్న పోర్టులు,విమానాశ్రయాల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఆ తర్వాత స్విస్‌లోని భారత్‌ రాయబారి మృదుల్‌కుమార్‌తోనూ చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. స్విస్‌లో అతిపెద్ద వ్యాపార రంగంగా వెలుగొందుతున్న ఫార్మాలో ప్రపంచస్థాయి సంస్థలు ఉన్నాయని....వారందరూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారు. అలాగే ఏపీని వర్క్‌ఫ్రం హోం హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం...ఆ దేశగా ఇక్కడి కంపెనీలతో చర్చలు జరపాలని కోరారు. ఆ తర్వాత తెలుగు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. మాతృభూమి రుణం తీర్చుకునేందుకు మీరంతా సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.అనంతరం అక్కడి నుంచి దావోస్‌కు బయలుదేరి వెళ్లారు.</div>
<div> </div>
<div><strong>తెలుగురాష్ట్రాల భవిష్యత్‌పై చర్చించాం</strong></div>
<div>జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌వేదికగా స్పందించారు. యాధృచ్చికంగా కలిసి స్వల్ప సమయమే మాట్లాడుకున్నా చర్చ చాలా గౌరవప్రదంగా జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు.తెలుగురాష్ట్రాల భవిష్యత్‌ గురించే ఈ సమావేశంలో చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రాలు వేరైనా తెలుగుజాతి ఒకటేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి అంతర్జాతీయంగా వెలుగొందాలని ఆయన అన్నారు. జ్యూరిక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం ఆనందగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు ప్రతిస్పందనగా <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> రీట్వీట్‌ చేశారు</div>
<p> </p>