<p>అమరావతి: సీనియర్ ఐపీఎస్, ప్రస్తుతం బిహార్ ఐజీ (ఫైర్ సర్వీసెస్)గా పనిచేస్తున్న ఎం. సునీల్ నాయక్‌ అరెస్టు చేసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. సునీల్ నాయక్‌ను ఏపీకి తరలించేందుకు అనుమతి (ట్రాన్సిట్ రిమాండ్) ఇవ్వాలని కోరుతూ ఏపీ పోలీసులు దాఖలు చేసిన దరఖాస్తును పాట్నా సివిల్ కోర్టు తిరస్కరించింది. ఈ అరెస్టు ప్రక్రియలో ఏపీ పోలీసులు అనుసరించిన విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని పట్నా కోర్టు పేర్కొంది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. మరో 30 రోజుల పాటు ఐపీఎస్ సునీల్ నాయక్ పై అరెస్ట్ లాంటి ఎలాంటి చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.</p>
<p><strong>బిహార్ లో ఏపీ పోలీసులకు చుక్కెదురు..</strong><br />ఏపీ పోలీసుల తీరుపై పట్నా సివిల్ కోర్టు మండిపడినట్లు తెలుస్తోంది. ఎస్పీ దామోదర్‌ సహా దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్‌ ఇంట్లోకి చొరబడటం ఏంటని ప్రశ్నించింది. సంబంధిత కేసు ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు.. కేసు డైరీ లేదు. స్థానిక కోర్టు నుంచి ఎలాంటి వారెంట్‌ లేకుంటే సామాన్యుడ్ని కూడా అరెస్ట్ చేయలేరు. ఒక ఐపీఎస్‌ అధికారిని అరెస్టు చేయడానికి రూల్స్ పాటించరా అని పట్నా సివిల్ కోర్టు ప్రశ్నించింది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు వివరాలను కోర్టుకు అందజేసి బిహార్ ఐజీ సునీల్‌ నాయక్‌ అరెస్టు చేస్తామని.. ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరగా కోర్టు అందుకు అనుమతించలేదు. </p>
<p>బాధ్యత గత అధికారి విషయంలో ఏపీ పోలీసులు, దర్యాప్తు టీం ఎలాంటి రూల్స్ పాటించకపోవడం, సీనియర్ ఐపీఎస్ పట్ల దురుసుగా వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా ఏపీ పోలీసుల వద్ద సరైన అరెస్ట్ వారెంట్ లేకపోవడం, కేస్ డైరీని అప్‌డేట్ చేయకపోవడంతో పాటు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని కోర్టు పేర్కొంది. కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అరెస్టు ప్రక్రియ ఉండరాదని పేర్కొంటూ పట్నా సివిల్ కోర్టు ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసింది. </p>
<p><strong>కస్టోడియల్ టార్చర్ కేసు ఏంటి..</strong><br />ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (అప్పటి నరసాపురం ఎంపీ) 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం కేసులో రఘురామకృష్ణరాజును సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కస్టడీలో ఉండగా తనను కొట్టారని, ఈ కుట్రలో పలువురు ఉన్నతాధికారుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. తనను పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, తనపై హత్యాయత్నం జరిగిందని 2024లో గుంటూరులో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. కేసు విచారణ పూర్తయ్యేవరకు, లేదా రిటైర్మెంట్ ఏది ముందుగా వస్తే అప్పటివరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఏపీ సీఐడీలో డీఐజీగా పనిచేస్తున్న ఐపీఎస్ సునీల్ నాయక్ ఈ కేసులో A7గా ఉన్నారు. ఈ కేసులో కేవలం సునీల్ నాయక్ మాత్రమే కాకుండా, అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, మాజీ ఏజీ, తదితరులపై కూడా ఆరోపణలు ఉన్నాయి.</p>
<p><strong>ట్రాన్సిట్ రిమాండ్ అంటే ఏమిటి?</strong><br />ఒక రాష్ట్రంలో అరెస్ట్ చేసిన వ్యక్తిని మరో రాష్ట్రంలోని సంబంధిత కోర్టుకు తరలించడానికి స్థానిక కోర్టు నుంచి అనుమతి పొందే ప్రక్రియను 'ట్రాన్సిట్ రిమాండ్' అంటారు. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, కేసు తీవ్రతను తెలిపే విషయాలు కోర్టుకు సమర్పిస్తే ట్రాన్సిట్ వారెంట్ కు అనుమతి లభిస్తుంది. అయితే సరైన ఆధారాలు లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కోర్టులు ట్రాన్సిట్ రిమాండ్ తిరస్కరిస్తుంటాయి. బిహార్ ఐజీ సునీల్ నాయక్ విషయంలో ఇదే జరిగింది. బిహార్ లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించి కోర్టులో హాజరుపరచాలని భావించిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది.</p>