<p><strong>CM Revanth Reddy Review On Excise Department: </strong>రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే టీజీబీసీఎల్‌కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని.. సదరు కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ఎక్సైజ్ కమీషనర్ హరికిరణ్ పాల్గొన్నారు. </p>
<p><strong>బీర్ల ధరలపై..</strong></p>
<p>ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం.. కంపెనీల ఒత్తిడి కి తలొగ్గేది లేదని.. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని సూచించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు.</p>
<p><strong>Also Read: <a title="Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు- రెచ్చగొట్టొద్దని హెచ్చరిక" href="https://telugu.abplive.com/telangana/nalgonda/youth-congress-leaders-attacked-bhuvanagiri-brs-office-ktr-harish-rao-and-kavitha-condemned-it-193828" target="_blank" rel="noopener">Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు- రెచ్చగొట్టొద్దని హెచ్చరిక</a></strong></p>