<p> అందమైన కాశ్మీర్ లోయలో భారతీయ రైల్వే అద్భుతాన్ని సృష్టించింది. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించింది. చినాబ్ అప్ నది నుంచి 359 మీటర్ల (1178 అడుగుల ) ఎత్తులో నిర్మించిన కాంక్రీట్, స్టీల్ ఉపయోగించి నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జిని ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నారు.</p>
<p><strong>కాశ్మీర్ లోయను మిగిలిన రాష్ట్రాలతో డైరెక్ట్ గా కలిపే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ </strong><br /> ప్రస్తుతం భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి - కాట్రా వరకూ డైరెక్ట్ గా ట్రైన్లో వచ్చేయొచ్చు. ఇంకో వైపున బారాముల్లా నుంచి శ్రీనగర్ మీదుగా రైల్వే లైన్ ఉంది. ఈ రెండు లైన్ల మద్యలో ఎత్తైన కొండలు, లోయలు నిండి ఉండడంతో ఇన్నాళ్లు రైల్వే లింక్ ఉండేది కాదు. దానితో బయట రాష్ట్రాల నుంచి శ్రీనగర్ రావాలంటే ఫ్లైట్ ద్వారానో లేక జమ్ము వరకూ ట్రైన్ లో వచ్చి అక్కడినుంచి రోడ్డు మార్గాన రావడమో అప్షన్ గా ఉండేది. దానితో గ్యాప్ ను పూర్తి చేసేందుకు బారాముల్లా -శ్రీనగర్ = ఉద్ధంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది ప్రభుత్వం.</p>
<p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/23/9e185ca601b3967a646cd3392e5622591734930920586233_original.jpg" /></p>
<p>అత్యంత ఎత్తులో కొండలను తవ్వి సొరంగాలు (టన్నెల్స్ )ఏర్పాటు చేస్తూ నిర్మించిన ఈ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గా చెబుతున్నారు రైల్వే అధికారులు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రైల్వే ప్రాజెక్ట్ త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆ రైల్వే లైన్ లోనే సన్గాల్ దాన్ (SangalDan ) రియాసీ (Reasi ) స్టేషన్ ల మధ్య ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించారు.</p>
<p><strong>ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక సవాల్ </strong><br />పర్వతాలు, లోయలు, విపరీతమైన చలి గాలులతో నిండి ఉండే ఈ ప్రాంతంలో అంత ఎత్తులో నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం ఒక సాహసమనే చెప్పాలి. దాన్ని సవాల్ గా స్వీకరించిన రైల్వే శాఖ 1315 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మించింది. అనేక డిజైన్లు పరిశీలించిన తర్వాత "ఆర్చి " మోడల్ లో ఈ బ్రిడ్జిని కట్టారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి తో పాటు ఎత్తైన ఆర్చ్ మోడల్ బ్రిడ్జ్ గానూ చినాబ్ రైల్ బ్రిడ్జి రికార్డు సృష్టించిందని చినాబ్ రైల్ బ్రిడ్జి ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మల్లిక్ (Mallik ) తెలిపారు.</p>
<p><strong> కాశ్మీర్ రూపురేఖలు మార్చే రైల్ ప్రాజెక్ట్ </strong></p>
<p> కాశ్మీర్లో టూరిజం డెవలప్మెంట్ కు ఈ బారాముల్లా- శ్రీనగర్ -ఉద్ధంపూర్ రైల్వే లైన్ చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి అద్భుతమైన బ్రిడ్జిలు, పొడవైన టన్నెల్స్ (కొన్ని చోట్ల 10కిమీ కంటే పొడవైన సొరంగాలు ), కళ్ళు చెదిరిపోయే లోయల గుండా సాగే ఈ రైల్వే లైన్లో చినాబ్ రైల్ బ్రిడ్జ్ అతిపెద్ద టూరిజం ఎట్రాక్షన్ గా మారుతుంది అని నార్తర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నిధి పాండే సింగ్ చెప్పారు. ఈ రైల్వేలైన్ నార్తర్న్ న్ రైల్వే పరిధిలోకి వస్తుంది. కాశ్మీర్ లోయలో ఉండే కుగ్రామాల నుంచి శ్రీనగర్ లాంటి టౌన్లకు వ్యాపారం,జీవనోపాధి కోసం వచ్చే సామాన్యులకు ఈ రైల్వే లైన్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి శ్రీనగర్ నుండి సంగాల్దాన్ వరకూ రైలు నడుపుతున్నారు. రక్షణ అవసరాలకు,సరుకు రవాణా కు కూడా ఈ రైల్వే చాలా ముఖ్యం. </p>
<p><strong>మంచు కొండల మధ్య, ప్రకృతి అందాలు చూస్తూ సాగే ప్రయాణం</strong><br />అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ రైల్వే లింక్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్ బ్రిడ్జిపై రైల్లో వెళుతూ ప్రకృతి అందాలు ఆస్వాదించడం పర్యాటకులకు ఒక మరపురాని అనుభూతిగా మారిపోబోతోందని రైల్వే శాఖ చెబుతోంది.</p>