<p><strong>Sheetlaashtami Temple:</strong> మాతా శీతలా ఆలయంలో తొక్కిసలాట జరిగింది..ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు..అందరూ మహిళలే. 12 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. బీహార్ షరీప్ నుంచి సుమార్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాగ్రా గ్రామంలో ఉంది ఆలయం. శీతలాష్టమి కారణంగా భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పూజా కార్యక్రమాల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. <br /><strong>మాతా శీతలా ఆలయం చరిత్ర</strong></p>
<p>స్కంద పురాణం ప్రకారం సతీదేవి శరీరాన్ని మోస్తూ తన కర్తవ్యాన్ని మరిచాడు శివుడు.. ఆ సమయంలో సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండించాడు శ్రీ మహావిష్ణువు. ఈ సమయంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలో శక్తిపీఠాలు. అవశేషాలను శివుడు బీహార్ షరీఫ్ సమీపం పంచానే నది దగ్గర ఖననం చేశాడట. ఆ తర్వాత అక్కడ మహారాజు వృక్షకేతు కలలో కనిపించిన శీతలా మాత ఆ స్థలంలో తవ్వమని ఆదేశించింది. చైత్రమాసం కృష్ణపక్షం సప్తమి రోజు తవ్వగా విగ్రహం బయటపడింది. గుప్తుల కాలంలో చైనా యాత్రికుడు ఫా హియన్ ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన రచనల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావించారు. శీతలామాత జన్మస్థలంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు భక్తులు. ఈ ఆలయానికి సుమారు 2వేల సంవత్సరాల చరిత్ర ఉందంటారు</p>
<p><strong>మాతా శీతలా ఆలయం విశిష్టత ఏంటి?</strong></p>
<p>నలంద జిల్లా మాగ్రా గ్రామంలో ఉన్న మా శీతలా ఆలయం బీహార్ లో ప్రముఖ సిద్ధపీఠాల్లో ఒకటి. పార్వతిదేవికి అంకితం చేసిన ఆలయం ఇది. వేడి కారణంగా వచ్చే అనారోగ్యాల నుంచి అమ్మవారు ఉపశమనం కలిగిస్తారని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా చికెన్ పాక్స్ వంటి రోగాలు నయం అవుతాయని నమ్ముతారు. మగధ ప్రాంత నుంచి లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కేవలం రోగాల నివారణే కాదు.. పిల్లల ఆరోగ్యం, సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఆలయం ప్రాంగణంలో ఉన్న కొలనులో స్నానం ఆచరించ పూజచేయాలనే నియమాన్ని అనుసరిస్తారు. పగటి వేళ దీప ధూపాలు, హోమాలు నిర్వహించరు... సాయంత్రం తర్వాత మాత్రమే దీపధూపాలు, హారతులు ఉంటాయి. ఇక్కడ కొలువైన శీతలామాతా విగ్రహం 12 అడుగుల నల్లరాయితో చెక్కినది..నాలుగు చేతుల్లో సూర్య చంద్రులు, కలశం, శీతలాష్టక గ్రంథం, నీము కొమ్మ ఉంటాయి. అమ్మవారికి నైవేద్యంగా పెరుగు పెడతారు. ఇక్కడ జంతుబలి నిషేధం<br /> <br /><strong>మాతా శీతలా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు</strong></p>
<p>ఏటా చైత్రమాసంలో నిర్వహంచే శీతలాష్టమి రోజు భారీగా భక్తులు తరలివస్తారు. మూడు రోజుల పాటూ జరిగే ఈ ప్రధాన ఉత్సవంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తారు. మూడో రోజు కొత్తగా వండిన వంటలు కాకుండా ముందురోజు చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. శీతలాష్టకం పఠనం, ఆరతి ఉంటుంది. ప్రతి మంగళవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. నవరాత్రి సమయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. </p>
<p>ఆరోగ్యం, సంతానం, సుఖశాంతులకోసం భక్తులు భారీగా తరలివస్తారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు భక్తులు</p>
<p><strong> గమనిక:</strong> ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. </p>