<p>Madhuri Divvela In Bigg Boss : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 అనేక మలుపులు తిరుగుతోంది. ఇంత వరకు ఫ్యామిలీ సీరియల్ మాదిరిగా సాగిన షోను ఇప్పుడు వైల్డ్ కార్డ్‌తో వచ్చిన వాళ్లు మారుస్తారని బిగ్‌బాస్ టీం భావించింది. అందుకే పూర్తిగా వివాదాల్లో మునిగిన వారిన వారినే ఏరికోరి షోకు పంపించారు. అలా పంపించిన వారిలో మొదటి వ్యక్తి దివ్వెల మాధురి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఉన్న స్నేహం, తర్వాత జరిగిన పరిణామాలు తెలియని తెలుగు వ్యక్తులు చాలా తక్కువగానే ఉంటారు. ఒకానొక కాలంలో ఆరు నెలల పాటు సోషల్ మీడియా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వీళ్ల వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ హల్‌చల్‌ చేశాయి. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆమెను తీసుకొచ్చారు. </p>
<p>నిజ జీవితంలో దివ్వెల మాధురి తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిపై రకరకాల వాదనలు ఉన్నాయి. రాజకీయంగా కూడా వారికి కొంత సమస్యలు ఎదుర్కొన్నారు. అదే టైంలో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. కానీ హౌస్‌లో మాత్రం వచ్చిన తర్వాత ఆమె ఆడుతున్న తీరు, ప్రవర్తిస్తున్న విధానంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అందరి మాస్క్‌లు తీస్తాను అని చెప్పి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె యాటిట్యూడ్‌ చిరాకు తెప్పిస్తోంది. మాట తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. </p>
<p>వచ్చిన రోజు నుంచి మాధురి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. వచ్చిన రోజునే శ్రీజతో గొడవకు సిద్ధపడ్డారు. మీ పేరు మాధురీయేనా అని అడిగినందుకు ఆమెపై ఫైర్ అయ్యారు. మీ ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. కావాలని గొడవ పెట్టుకుంటున్నావా అని ఆమెకో వాదనకు దిగారు. ఆమె వెళ్లేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఇష్టం లేనట్టుగా చేయి కలిపారు. </p>
<p><a title="పవన్ కల్యాణ్" href="https://telugu.abplive.com/topic/Pawan-Kalyan" data-type="interlinkingkeywords">పవన్ కల్యాణ్</a> పడాలతో కూడా అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. వంట గురించి మాట్లాడుకునే సందర్భంగా వాదన పెట్టుకున్నారు. కూర్చొండి మాట్లాడుకుందామని చెప్పినందుకు కూర్చోకుంటే చెప్పరా అంటూ చాలా అహంకారంతో సమాధానం చెప్పారు. ఆమె బ్యాక్‌గ్రౌండ్ చూసి చాలా మంది సభ్యులు చూసీ చూడనట్టుగా ఉంటున్నారు. ఎందుకొచ్చిన గొడవలే అని అనుకుంటున్నారు. మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఇంకోలా మాట్లాడాల్సి ఉంటుందని కల్యాణ్‌ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు దివ్య కూడా స్టాండ్ తీసుకొని వంట గురించి అడిగితే గొడవ పెట్టుకుంటున్నారేంటని ప్రశ్నించింది. చివరకు ఏడ్చేశారు కూడా. మిగతా హౌస్‌మేట్స్ జోక్యంతో ఆ వివాదం ముగిసింది. </p>
<p>మంగళవారం కూడా కర్రీ విషయంలో దివ్యతో గొడవ పెట్టుకున్నారు. పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఏదైనా తినే ముందు ఫుడ్ మానిటర్‌కు చెప్పాలని అన్నందుకు హౌస్‌లో రచ్చ రచ్చ చేశారు. ఆమె ఫుడ్ మానిటర్‌గా ఉంటే తాను తినబోనంటూ భీష్మించారు. బాండింగ్స్ పెట్టుకుంటూ హౌస్‌లో నెట్టుకొస్తున్నారని విమర్శలు చేశారు. చివరకు కెప్టెన్ కల్యాణ్‌ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కంట్రోల్ అయ్యింది. </p>
<p>మాధురితో ఎవరు మాట్లాడినా ఏయ్‌ అంటూ సంబోధించడం, అరవొద్దని ఆమె గట్టిగట్టిగా అరవడం, తనకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం అన్నీ కూడా అతిగా ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. బంధాల్లో ఇరుక్కొని సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెబుతూ వస్తున్న మాధురి ఇప్పుడు సంజనకు, తనూజకు దగ్గరవ్వడాన్ని ఏమనాలని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడి ఉన్న హౌస్‌మేట్స్ అందరికీ ఆమెపై కోపం ఉన్నప్పటికీ ఆమెకు ఉన్న పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వారిని కంట్రోల్ చేస్తోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కొన్ని సార్లు మాధురి బాగానే ఉంటున్నట్టు కనిపిస్తున్నా... తనకు అనుకూలంగా లేని వారితో రూడ్‌గా మాట్లాడుతున్నారని దాన్ని కంట్రోల్ చేసుకోవాలని న్యూట్రల్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.</p>