<p><strong>Bengali identity vs Hindutva: </strong>పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇది కేవలం గద్దెనెక్కడానికి జరుగుతున్న సమరం మాత్రమే కాదు, రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య నడుస్తున్న అస్తిత్వ పోరాటం. ఒకవైపు తృణమూల్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> అధినేత్రి మమతా బెనర్జీ బెంగాలీ అస్మితను తన రక్షణ కవచంగా మార్చుకోగా, మరోవైపు భారతీయ జనతా పార్టీ హిందుత్వ నినాదంతో బెంగాల్ గడ్డపై పాగా వేయాలని చూస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.</p>
<p><strong>బెంగాలీ అస్మిత దీదీ నినాదం</strong></p>
<p>మమతా బెనర్జీ తన ప్రచారంలో స్థానికతకు పెద్దపీట వేస్తున్నారు. బెంగాల్ తన సొంత కూతురినే కోరుకుంటోంది అనే నినాదంతో ఆమె ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బీజేపీ నేతలను బయటి వ్యక్తులుగా ముద్ర వేయడం ద్వారా బెంగాలీ ప్రజల్లో ప్రాంతీయ అభిమానాన్ని రగిలిస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి మహనీయుల వారసత్వం కేవలం తమ పార్టీతోనే సురక్షితమని ఆమె బలంగా నమ్ముతున్నారు.</p>
<p><strong>హిందూత్వ కార్డుతో బీజేపీ </strong></p>
<p>బీజేపీ మాత్రం హిందుత్వ కార్డుతో మమత కోటను బద్దలు కొట్టాలని చూస్తోంది. సరిహద్దు జిల్లాల్లో చొరబాటుదారుల సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలపై మమతను నిలదీస్తోంది. జై శ్రీరామ్ నినాదాన్ని కేవలం భక్తి కోణంలోనే కాకుండా ఒక రాజకీయ నిరసనగా మలచడంలో ఆ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెస్తామని, మతపరమైన వివక్షకు చరమగీతం పాడుతామని బీజేపీ ఓటర్లకు వాగ్దానం చేస్తోంది.</p>
<p><strong>బెంగాల్ ఎన్నికల్లో భావజాల యుద్ధం</strong></p>
<p>ఈ భావజాల యుద్ధం ఓటర్లను రెండు స్పష్టమైన వర్గాలుగా విడదీసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలు , ప్రాంతీయ గుర్తింపు వైపు మొగ్గు చూపుతుంటే, పట్టణ ప్రాంత యువతతో పాటు మతువా సామాజిక వర్గం జాతీయవాద నినాదాలకు ఆకర్షితులవుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలు ఓటర్ల ధ్రువీకరణను మరింత వేగవంతం చేశాయి. దీనివల్ల ప్రతి నియోజకవర్గంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది.</p>
<p><strong>అసలైన ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయన్న వాదన</strong></p>
<p> ఈ భావోద్వేగాల మధ్య రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి వంటి కీలక అంశాలు మరుగున పడిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగాల్ సంస్కృతిని కాపాడుకోవడమే ముఖ్యమని తృణమూల్ అంటుంటే, అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ వాదిస్తోంది. తమ రాష్ట్రం గుజరాత్ మోడల్ లాగా మారకూడదని మమత చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2026 ఫలితాలు బెంగాల్ భవిష్యత్తు ఏ దిశగా సాగాలో నిర్ణయించనున్నాయి. మమతా బెనర్జీ విజయం సాధిస్తే ప్రాంతీయ వాదానికి, బెంగాలీ గుర్తింపునకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> అధికారంలోకి వస్తే హిందుత్వ రాజకీయాలకు బెంగాల్ గడ్డపై స్థిరత్వం లభించినట్లు అవుతుంది. ఈ పోరులో సామాన్య ఓటరు ఏ వైపు నిలుస్తారో చూడాలి. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/why-tiny-tugboats-can-easily-move-massive-container-ships-242136" width="631" height="381" scrolling="no"></iframe></p>