<p><strong>Andhra Pradesh Latest News:</strong>ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి అభివృద్ధికి కీలకమైన సీఆర్డీఏ నుంచి పౌరసరఫరాల శాఖ వరకు అలాగే కీలక జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. </p>
<h3>సీఆర్‌డీఏ కొత్‌ బాస్‌గా విజయ రామరాజు </h3>
<p>రాష్ట్ర రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ కమిషనర్‌గా పని చేస్తున్న కె. కన్నబాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయ రామరాజు వచ్చారు. ఈయన 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి. విజయ రామరాజు ఇది వరకు పాఠశాల విద్య విభాగం డైరెక్టర్‌గా పని చేశారు. ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టించే బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. </p>
<p>మరోవైపు సీఆర్డీఏ నుంచి బదిలీ అయిన కె. కన్నబాబును పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతోపాటు వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఎక్స్ అఫీషియో సెక్రటరీగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న సౌరబ్‌ గౌర్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. </p>
<h3>జిల్లాలకు కొత్త కలెక్టర్లు</h3>
<p>రాష్ట్రంలోని రెండు ముఖ్యమైన జిల్లాలకు కొత్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. అగ్రికల్చర్ మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఎం. విజయ సునీతను మార్కాపురం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆయుష్‌ విభాగం డైరెక్టర్‌గా పని చేస్తున్న కోతమాను దినేష్‌ కుమార్‌ను పోలవరం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. </p>
<h3>అదనపు బాధ్యతలు- ఇతర మార్పులు </h3>
<p>ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న పట్టంశెట్టి రవి సుభాష్‌కు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. విజయ సునీత బదలీతో ఖాళీ అయిన అగ్రికల్చర్‌ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టుకు రవి సుభాష్‌ను ఎఫ‌ఏసీ బాధ్యతలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే రవి సుభాష్ తన ప్రస్తుతం బాధ్యతలతోపాటు వ్యవసాయం శాఖ మార్కెటింగ్ శాఖ పనులను కూడా పర్యవేక్షించాలి. </p>
<p> <br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/21/035f2825366a6f5bfa6ff190f536a6331774057897918215_original.jpeg" /></p>