<p><strong>Legality to Amaravati:</strong> ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపునిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో ఒక ప్రత్యేక సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదాపై కసరత్తు పూర్తి చేయగా, కేంద్ర న్యాయశాఖ కూడా తన ఆమోదాన్ని తెలిపింది. రాబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. </p>
<p>అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ప్రధానంగా న్యాయపరమైన సమస్యల వల్ల ఏర్పడింది. 2014 విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే, ఆ పదేళ్ల గడువు జూన్ 2, 2024 ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అధికారిక రాజధాని ఏది అనే అంశంపై చట్టంలో స్పష్టమైన ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో గందరగోళం ఏర్పడటం, రైతులు కోర్టులను ఆశ్రయించడం వంటి పరిణామాల కారణంగా భవిష్యత్తులో రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని మారకుండా ఉండాలంటే పార్లమెంట్ చట్టబద్ధత ఉండాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. <br /> <br />2014 జూన్ 2 నుంచే అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే, ఇందులో ఒక చిన్న సాంకేతిక సమస్య ఎదురైంది. 2014 జూన్ నుంచి 2024 జూన్ వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున, పాత కాలానికి చట్టబద్ధత ఇవ్వడంపై కేంద్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఇది అత్యవసరమని ఏపీ ప్రభుత్వం వాదించడంతో, కేంద్రం అటార్నీ జనరల్‌తో సంప్రదింపులు జరిపి మధ్యేమార్గాన్ని అన్వేషిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, అమరావతికి ప్రత్యేకమైన PIN కోడ్, STD కోడ్ మరియు ఒకే అడ్మినిస్ట్రేటివ్ ఐడెంటిటీ లభిస్తాయి. <br /> <br />ఈ బిల్లు ద్వారా అమరావతికి చట్టబద్ధత లభిస్తే ప్రపంచ బ్యాంక్ , ఏసియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ వంటి సంస్థల నుండి రుణాలు పొందడం మరింత సులభతరం అవుతుంది. విధానపరమైన స్పష్టత ఉండటం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుంది. అలాగే, గతంలో భూములు ఇచ్చిన 34 వేల మంది రైతులకు భద్రత లభించినట్లవుతుంది. కేంద్ర సంస్థలైన ఎయిమ్స్, ఐఐటీ వంటివి శాశ్వత ప్రాతిపదికన తమ కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ బిల్లు ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లే. అందుకే ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/did-you-know-these-things-about-bjp-s-new-president-nitin-nabeen-235078" width="631" height="381" scrolling="no"></iframe></p>