<p data-path-to-node="0">Afghanistan-Pakistan Conflict: పాకిస్థాన్, తాలిబన్ల మధ్య రాత్రంతా భీకర దాడులు కొనసాగాయి. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేసింది. పిరికిపంద పాకిస్థాన్ సైన్యం కాబూల్, కాందహార్, పక్తియాలోని కొన్ని ప్రాంతాల్లో బాంబులు కురిపించిందని తాలిబన్ ప్రతినిధి అన్నారు. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. మరోవైపు, వీటన్నింటికీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కారణమని.. తమ సహనం నశించిందని, ఇక యుద్ధం మొదలైందని పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలోకి భారత్‌ను కూడా లాగుతూ ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.</p>
<p data-path-to-node="0">పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో (NATO) దళాలు వెళ్లిపోయిన తర్వాత అక్కడ శాంతి నెలకొంటుందని, తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాలు, ప్రాంతీయ స్థిరత్వంపై ఫోకస్ చేస్తారని ఆశించాం. కానీ తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్‌కు కాలనీగా మార్చారు. ప్రపంచం నలుమూలల నుండి ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్‌లో చేర్చి, టెర్రరిస్టులను ఎగుమతి చేయడం ప్రారంభించారని’ ఆరోపించారు.</p>
<p>ఆఫ్ఘన్ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రాథమిక మానవ హక్కులను నిరాకరించిందని ఖవాజా ఆసిస్ అన్నారు. ఇస్లాం మహిళలకు ఇచ్చే హక్కులను సూతం వారు లాక్కున్నారని ఆరోపించారు. పరిస్థితులను బాగుచేయడానికి పాకిస్థాన్ సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేసిందన్నారు. మేం ఎంతో దౌత్యం చేశాం, కానీ తాలిబన్ భారత్ కు ప్రాక్సీగా మారిందని, వారు చెప్పినట్లు చేస్తుందని ఆరోపించారు. </p>
<p><strong>ఇక మా ఓపిక నశించింది.. పాక్ రక్షణ మంత్రి</strong><br />పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, అల్లా దయతో మా సైన్యం తాలిబన్లకు గట్టిగా బదులిస్తోందని ఆసిఫ్ చెప్పారు. గతంలో పాకిస్థాన్ పాత్ర సానుకూలంగా ఉందని, 50 ఏళ్లుగా 5 మిలియన్ల మంది ఆఫ్ఘన్లకు ఆశ్రయం కల్పించామని తెలిపారు. నేడు సైతం లక్షలాది మంది ఆఫ్ఘన్లు మా భూమిపైనే జీవనోపాధి పొందుతున్నారని, అయితే ఇప్పుడు మా ఓపిక నశించింది అన్నారు. ఇక తాలిబన్లతో బహిరంగ ఘర్షణ మొదలైందని ప్రకటించారు. ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయని, పాకిస్థాన్ సైన్యం సముద్రాలు దాటి రావడంలేదని, మేం మీ పొరుగున ఉండేవాళ్లం.. మీ అసలు స్వరూపం మాకు బాగా తెలుసని హెచ్చరించారు.</p>
<p data-path-to-node="1">పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తత ఇప్పుడు యుద్ధంగా మారింది. ఈ ఘర్షణ 21 ఫిబ్రవరిన ప్రారంభమైంది. అప్పుడు పాక్.. ఆఫ్ఘనిస్తాన్‌లో వైమానిక దాడులు చేసింది. దాంతో తాలిబన్లు ఎదురుదాడులకు దిగడంతో పరిస్థితి మరింత ముదిరింది. పాకిస్థాన్ 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్'ను ప్రారంభించింది. </p>
<p data-path-to-node="2"><strong data-path-to-node="2" data-index-in-node="0">133 మంది ఆఫ్ఘన్ సైనికులను చంపినట్లు పాకిస్థాన్ వాదన</strong></p>
<p data-path-to-node="3">పాకిస్థాన్ జరిపిన దాడిలో ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి చెందిన 133 మంది సైనికులు మరణించారని, 200 మందికి పైగా సైనికులు గాయపడ్డారని పాకిస్థాన్ మంత్రి అతావుల్లా తరార్ X (ట్విట్టర్) వేదికగా తెలిపారు. పాకిస్థాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 27 పోస్టులను ధ్వంసం చేసిందని, 9 పోస్టులను ఆక్రమించిందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 80కి పైగా ట్యాంకులు, ఆర్టిలరీ, ఇతర పరికరాలను ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. పాకిస్థాన్ వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత, మరోసారి ఆఫ్ఘనిస్తాన్ ఉదయం 5:30 గంటలకు పాకిస్థాన్‌పై స్పిన్ బోల్డాక్-చమన్ బోర్డర్, హెల్మండ్-బారామ్చా బోర్డర్‌లపై దాడులు ప్రారంభించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని 8 సెక్టార్లలో పాకిస్థాన్‌ సైన్యంతో పోరాడుతోంది.</p>
<p data-path-to-node="4">ఆఫ్ఘనిస్తాన్ సైనిక స్థావరాలతో పాటు, పక్తికాలో సైనిక స్థావరం పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లోని నిర్వాసితుల శిబిరంపై పాక్ ఆర్మీ డ్రోన్ దాడి చేసింది, ఇందులో 11 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ దాడులు ప్రారంభించిన తర్వాత వారి సైనికులు 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. కాబూల్, కాందహార్, పక్తికాలోని సైనిక స్థావరాలపై జరిగిన వైమానిక దాడుల్లో ఏ ఒక్క ఆఫ్ఘన్ పౌరుడు లేదా సైనికుడు మరణించలేదని స్పష్టం చేసింది.</p>