<p>Adulterated Liquor Scare in Pamarru | పామర్రు: ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించే మద్యం నాణ్యతపై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని కాజా గ్రామంలో గల ఒక వైన్ షాపులో జరిగిన ఉదంతం ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది. ఒక కంపెనీకి చెందిన బీర్ బాటిల్‌పై మరొక కంపెనీకి చెందిన మూత (క్యాప్) ఉండటం చూసి మందుబాబులు విస్తుపోయారు. ఈ వ్యత్యాసం గమనించిన వినియోగదారులు ఆ మద్యం దుకాణ సిబ్బందిని నిలదీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.</p>
<p><strong>కల్తీ బీర్లు అమ్ముతున్నారని స్థానికుల ఆందోళన</strong></p>
<p>కేవలం మూతలు మారడమే కాకుండా, కొన్ని బీర్ బాటిళ్లలో ఏదో చనిపోయి తేలుతూ కనిపించడం భయాందోళనలకు గురిచేస్తోంది. దీనిపై మందుబాబులు సిబ్బందిని ప్రశ్నించగా, వారు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ‘మాకేం తెలియదు, పై నుంచే బాటిళ్లు ఇలాగే వచ్చాయి’ అంటూ వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కనీసం మద్యం విక్రయించే సమయంలో షాపులోని సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని సిబ్బంది చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.</p>
<p>ఇంతటి దారుణం జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ వైన్ షాపులో తనిఖీలు చేపట్టకపోవడంపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ బీరు తాగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ, ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి కల్తీ మద్యం విక్రయాలు సాగుతుంటే సామాన్యుల ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంటుందని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని కోరుతున్నారు.</p>
<p> </p>